అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ

అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రంగా విమర్శించారు

By -  Knakam Karthik
Published on : 7 April 2026 2:43 PM IST

Andrapradesh, Amaravati, YSRCP, TDP, AP Politics, Capital City, Construction Scam

అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ

అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదరపు అడుగుకు రూ. 7,000 మాత్రమే ఖర్చవుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, వాస్తవానికి టెండర్ డేటా ప్రకారం ఈ ధర రూ. 12,000 నుండి రూ. 14,000 వరకు ఉందని ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే బిల్డప్ ఏరియాను కాగితాలపై పెంచి చూపిస్తూ, చదరపు అడుగు ధర తక్కువగా ఉన్నట్లు భ్రమింపజేస్తోందని మండిపడ్డారు.

సిఆర్డీఏ (CRDA) భవన నిర్మాణ ఖర్చులను కూడా దాచిపెడుతున్నారని, ఏసీలు, లిఫ్టులు, జీఎస్టీ వంటివన్నీ కలిపితే దీని వ్యయం రూ. 335 కోట్లకు చేరుతుందని ఆయన వివరించారు. సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం కూడా రూ. 2,200 కోట్ల నుండి రూ. 7,724 కోట్లకు పెరిగిందని, ఇంత భారీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తప్పుడు లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. విదేశీ సంస్థలకు కన్సల్టెన్సీల పేరుతో కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

కేవలం రూ. 20,000 కోట్లతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (MAVIGUN మోడల్) ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని జగన్ మోహన్ రెడ్డి సూచించిన ప్లాన్-బిని ఆయన గుర్తు చేశారు. అమరావతి అనేది వాస్తవ రాజధాని కాదని, అది కేవలం భారీ అంచనాలు, మోసపూరిత లెక్కలతో నిర్మిస్తున్న ఒక భ్రమ మాత్రమేనని నరేంద్ర విమర్శించారు.

Next Story