ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తెలిపారు. ఈ నెల పదో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల మూడో తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఫలితాలు కూడా వెలువడడంతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల కోడ్ ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాట్లకు దరఖాస్తుల స్వీకరణ నిలిపేశామన్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన లబ్ధిదారులంతా ఈ నెల పదో తేదీ నుంచి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా రుణాల మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత ఆ ప్రకటనలో కోరారు.