ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు: సీఎం చంద్రబాబు
పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik
ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు: సీఎం చంద్రబాబు
అమరావతి: పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ తో పనిచేయాలని. ప్రపంచం పోకడలను గమనిస్తూ అవకాశాలను అందుకోవాలన్నారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలి. ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించదాంతో పాటు.. కనీస అవసరాలు అందించాలన్నారు.
వివిధ రంగాల్లో ఫలితాలను సాధించేందుకు ఏ ప్రమాణాల్నినిర్దేశించుకున్నారనేది కూడా కీలకం. ప్రస్తుతం అవేర్ ద్వారా 42 అంశాలను కొలుస్తున్నాం... వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఇదే స్థాయిలో ప్రమాణాలు నిర్దేశించుకుని ఇండికేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్, రవాణా, జలవనరులు, పరిశ్రమలు, స్వచ్ఛాంధ్ర ఇలా అన్ని విభాగాలూ ఇండికేటర్లను నిర్దేశించుకోవటం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాల్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాణాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం అందించే 700 సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి. కేవలం 60 లక్షల జనాభా, పరిమితమైన వనరులతో సింగపూర్ దేశం అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోంది. భారత్ లో 140 కోట్లకు పైగా జనాభా, అపారమైన వనరులతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. బయటి ప్రపంచం చూడకుండా మనకు మనమే తెలివైన వాళ్లని భావించుకోవడం సరికాదు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమచారాన్ని క్రోడీకరిస్తే అది అతిపెద్ద సంపద అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సమాచారాన్ని విశ్లేషించి వినియోగించుకుని ప్రభుత్వ శాఖల సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. అలాగే ప్రతీ త్రైమాసికానికీ సాధిస్తున్న పురోగతిపై ప్రభుత్వ శాఖలు సమీక్షించుకోవాలి.. అని ముఖ్యమంత్రి సూచించారు.