యువకునిపై ఫిర్యాదు చేసిన అమృత
By సుభాష్ Published on 15 March 2020 9:42 PM IST
తెలంగాణలోని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉన్న విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అమృత ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. విజయ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే సమాచారాన్ని నిందితుడైన కరీంకు విజయ్ చేరవేస్తున్నాడన్న అనుమానంతో అమృత అతనిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఇటీవల అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తండ్రిని చివరి సారిగా చూసేందుకు వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయ్ శ్రవణ్కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. శనివారం అమృత తల్లి గిరిజను కలిశారు.