కరోనాను జయించిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఆరాధ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 1:31 PM GMT
కరోనాను జయించిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఆరాధ్య

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ అభిమానులకు నిజంగా శుభవార్తే ఇది. కరోనా నుంచి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఆమె కుమారై ఆరాధ్య బచ్చన్‌ కోలుకున్నారు. వారికి నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్‌ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని ఐశ్వర్య రాయ్‌ భర్త అభిషేక్‌ బచ్చన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్‌-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్‌ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారంటూ ట్వీట్‌ చేశారు. అయితే తన తండ్రి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

"మా కోసం చేసిన ప్రార్థనలకు మీకు ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది. ఐశ్వర్య, ఆరాధ్యలకు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. ఇద్దర్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం వారిద్దరు ఇంటికి చేరుకున్నారు. నేను, నా తండ్రి ఇద్దరం ఇంకా ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంది." అని ట్వీట్‌ చేశాడు అభిషేక్‌ బచ్చన్‌.



కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 12న అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలగా.. వారు కొద్ది రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో గడిపారు. అయితే ఆ తరువాత లక్షణాలు ఎక్కువవుతుండటంతో ఆసుపత్రిలో చేరి, తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్‌ కుటుంబంలో జయాబచ్చన్‌ ఒక్కరే సురక్షితంగా ఉన్నారు.

Next Story