సుశాంత్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల‌ కీలక రిపోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2020 7:01 AM GMT
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల‌ కీలక రిపోర్టు

బాలీవుడ్ యువ‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రభుత్వానికి‌ కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ మృతిపై సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు.

సుశాంత్ ఉరి వేసుకోవడం కార‌ణంగా మృతిచెందాడ‌ని.. ఆయ‌న‌‌ మృతదేహంలో ఎలాంటి విషం లేదని.. సూశాంత్‌ది ముమ్మాటికి ఆత్మ‌హ‌త్యేన‌ని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని.. ఇందులో ఎటువంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. అంత‌కుముందు మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే.. తమ పరిశీలనలోనూ తేలాయని తాజా నివేదికలో తెలిపారు.

ఇక‌.. సుశాంత్ జూన్‌ 14న ముంబైలోని తన బిల్డింగ్‌లో‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సుశాంత్‌ మృతిపై అత‌ని తండ్రి.. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయ‌ని.. ఎవరో గొంతునులిమి హత్య చేశార‌ని.. ఇది ముమ్మాటికి హత్యేనని బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత కూడా సుశాంత్ ఆత్మ‌హ‌త్య విష‌య‌మై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేఫ‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది.

అనంతరం ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. డ్రగ్స్ కోణం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ కేసును మరోవైపు విచారిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సుశాంత్ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు.

Next Story