విస్తరిస్తున్న మహమ్మారి...!

By Newsmeter.Network  Published on  1 Dec 2019 8:07 AM GMT
విస్తరిస్తున్న మహమ్మారి...!

ముఖ్యాంశాలు

  • దేశంలో విస్తరిస్తున్న హెచ్ఐవీ
  • 2030 నాటికి రోజుకు 80 మంది యుక్త వయసులకు వైరస్ వ్యాప్తి
  • హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి
  • నేడు ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం

పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రచారం ఒకప్పుడు ఊరూ వాడా హోరెత్తించింది. ఎయిడ్స్ లేదా హెచ్‌ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులవి. ‘పులిరాజా’ ప్రచారం జనంలో ఎయిడ్స్ పై కొంత మేరకు అవగాహన కల్పించడంలో సఫలమైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్ నుంచి జనం దృష్టి మళ్లింది. కొన్నేళ్లుగా ఎయిడ్స్/హెచ్‌ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే... 2030 నాటికి రోజుకు 80 మంది యుక్త వయస్సులు ఈ మహమ్మారికి బలవ్వాల్సిందేనని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఎయిడ్స్ మరణాలు, కొత్త ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ తగ్గింపులో అంత వేగం కనిపించడం లేదు. హెచ్‌ఐవీ సోకిన బాలల్లో సగం మంది ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్నారని చెబుతోంది. ఎయిడ్స్ పై వైద్య నిపుణులు ఏం వివరిస్తున్నారో ఓ సారరి పరిశీలిద్దాం…

తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వివరించిన లెక్కల ప్రకారం చూస్తే… దేశంలోనే అధికంగా హైదరాబాద్లో హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నట్లుగా సమాచారం. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో 83,102 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2017 గణాంకాల ప్రకారం ఈ ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో నమోదైన హెచ్ఐవీ కేసులు 9,324. ఇక అప్పటి నుంచి ఆ సంఖ్య తగ్గట్లేదట.

ప్రతి ఏటా రాష్ట్రంలో 10 వేలకు పైగా …

రాష్ట్రంలో ఏటా కొత్తగా 10 వేలకు పైగా బాధితులు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 5942 మంది హెచ్ఐవీ బాధితులుగా మారినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో1.20 లక్షల మందికి హెచ్ఐవీ సోకినట్లు అంచనా. వీరిలో 88,800 మంది మాత్రమే హెచ్ఐవీ మందులు వాడుతున్నారు. హెచ్ఐవీ సోకినా, ఆ విషయం తెలియనివారు మరో 50 వేల మందికి పైగా ఉండొచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించటానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు

గ్రేటర్ లోనే ఎక్కువ

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 24,780 మంది హెచ్ఐవీ బాధితులు, ఇక్కడే మందులు కూడా తీసుకుంట్లు అధికారులు వివరిస్తున్నారు. వ్యభిచారం ఎక్కువగా ఉండటం, రక్షణ లేని శృంగారం కారణంగా హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఇక్కడే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. రక్షణ లేని శృంగారం కారణంగానే 98 శాతం హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని, రక్త మార్పిడి, సిరంజీల ద్వారా 2 శాతమే ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిఏటా డిసెంబర్ 1న :

ప్రతిఏటా డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం " గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా కోట్లాది మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు. భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది.

మూడు దశాబ్దాల కిందటి వరకు ఎయిడ్స్/హెచ్‌ఐవీ అంటే జనానికి ఏమీ తెలియదు. ఫ్రెంచి సంతతికి చెందిన కెనడియన్ ఫ్లైట్ అటండెంట్ గేటన్ డుగాస్ అంతుచిక్కని లక్షణాలతో అమెరికాలో చికిత్స పొందుతూ 1984లో మరణించాడు. అమెరికన్ వైద్య నిపుణులు ఇతడినే తొలి ఎయిడ్స్ రోగిగా గుర్తించారు. ఎన్‌ఏసీఓ(నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) మార్చి, 2014 లెక్కల ప్రకారం మన దేశంలో 20.89 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడినారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లో 4.19 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు గా గుర్తించారు. భారత దేశం లో మొత్తం ఎయిడ్స్ ఉన్నవారిలో యువతీ యువకులు 31 శాతం ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఏసీఓ వారు మూడు మార్గాలను సూచించారు. 1) యువతీ, యువకులు తెలియని వయస్సులో సెక్స్ కి దూరంగా ఉండడం. 2) జీవిత భాగస్వామి తోనే నమ్మకంగా సెక్స్ లో పాల్గొనడం. 3) నిరోధ్‌ని కచ్చితంగా వాడడం.

సమాజం లో అందరిలాగానే కలిసి జీవించే హక్కు ఎయిడ్స్ ఉన్న వారికి కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు, విద్యా సంస్థలు వారి హెచ్.ఆర్ పాలసీతోపాటు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ మెయి న్ స్ట్రీమింగ్ పాలసీని కూడా తయారు చేసుకొని, అమలు పరచాలి. ఎయిడ్స్ ఉన్న తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల భారతదేశంలో దాదాపు 1.50 లక్షల మంది పిల్లలు ఎయిడ్స్ తో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గర్భం ధరించిన వెంటనే తల్లిదండ్రులు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకొని తగు చర్యలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎయిడ్స్ ఉన్న తల్లి నుండి బిడ్డకు ఎయిడ్స్ సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. హెచ్‌ఐవీ సోకిందని తెలిసిన వెంట నే తగు చర్యలు, చికిత్సలు తీసుకోవడం ద్వారా మనిషి చాలా కాలం సంతోషంగా బతకగలడని వైద్యులు సూచిస్తున్నారిలా.

1) హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి కచ్చితంగా యాంటి రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్‌టీ) మందులు క్రమంతప్పకుండా తీసుకోవాలి.

2) వీలైనంత వరకు పౌష్టికాహా రాన్ని తీసుకోవాలి.

3) మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా అందరితో కలిసి మామూలుగానే జీవించాలి. ‘సెక్స్’ అనేది అనివార్యము. కాని ‘ఎయిడ్స్’ అనే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిరోధించవచ్చు అనే నినాదంతో మనందరం కలిసి ఎయిడ్స్ రహిత సమాజం కోసం పని చేద్దాం.

హెచ్ఐవీ ఏమిటి? ఎయిడ్స్ ఏమిటి?

హెచ్‌ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) మనిషిలో రోగనిరోధకశక్తిని హరింపజేసే ఒక వైరస్. ఇది ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలు దీని స్థావరాలు. ఇది ఎవరికైనా ఉందని నిర్ధారణ కావడమే హెచ్‌ఐవి పాజిటివ్. అయితే, దీనికిదే జబ్బు కాదు.

వైరస్ సోకిన ఒకటి నుంచి నాలుగు వారాల్లో అది మనిషి శరీరంలో పూర్తిగా వ్యాపిస్తుంది. తన సంఖ్యను తాను పెంచుకుంటూ పోతుంది. పెంచుకోవడమే కాకుండా, మనిషికి రోగనిరోధక శక్తినిచ్చే సీడీ-4 కణాలను చంపుతూ ఉంటుంది. దీనివల్ల, మరేదైనా వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దాన్ని సహజంగా ఎదుర్కొగలిగే రక్షణ వ్యవస్థ మనిషికి ఉండదు. దాంతో అతడికి ఏ స్వల్ప రుగ్మత సోకినా ప్రాణాలమీదికి వస్తుంది. ఇదీ ఎయిడ్స్! (ఎ.ఐ.డి.ఎస్.- ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్).

తొలుత ‘4హెచ్’ వ్యాధి

హెచ్‌ఐవి సోకిన తర్వాత, మనిషిలో సీడీ కౌంట్ 200/ఎంఎం క్యూబ్ దాకా పడిపోయినప్పుడు ఎయిడ్స్ కు దాదాపుగా చేరువైనట్టు! ఈ స్థితి కొందరికి ఒకట్రెండేళ్లకే రావొచ్చు; కొందరికి 10-12 ఏళ్లదాకా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. 1981లో అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తొలిసారిగా ఎయిడ్స్ వ్యాధిని గుర్తించింది. తర్వాత, దీనికి కారణం హెచ్‌ఐవి వైరస్ అని తేల్చింది. 1970ల ప్రాంతంలో కొందరు అమెరికా యువకుల్లో- ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వాడేవారు, హోమోసెక్సువల్సులో రోగనిరోధక శక్తి పోయి, అరుదుగా సంభవించే చర్మవ్యాధులు వారికి సోకాయి. అంతుబట్టని, పేరులేని రుగ్మతలుగానే ఇవి కొన్నాళ్లు కొనసాగాయి. కొంతకాలం దీన్ని ‘4హెచ్ వ్యాధి’ అని పిలిచేవారు. ఎందుకంటే-హైతియన్స్(అమెరికాలోని హైతీమూలాలున్న ప్రజలు), హోమోసెక్సువల్స్(స్వలింగ సంపర్కులు), హీమోఫీలియాక్స్(రక్తం ఆగనివాళ్లు), హెరాయిన్ యూజర్స్(మాదకద్రవ్యం హెరాయిన్ వాడేవాళ్లు)లో మాత్రమే ఈ వ్యాధిని తొలుత ఎక్కువగా గుర్తించడంవల్ల! మరికొన్నాళ్లు ‘గ్రిడ్’ (జి.ఆర్.ఐ.డి.- గే రిలేటెడ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ)గా కూడా పిలిచారు. ఇది స్వలింగ సంపర్కులకు మాత్రమే పరిమితమైన జబ్బు కాకపోవడం వల్ల దీనికి మించిన పేరు అవసరమైంది. అలా ‘ఎయిడ్స్’ అనే మాట ఉనికిలోకి వచ్చింది.

ఆఫ్రికా కోతుల్లో మొదలు...

ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో పశ్చిమ మధ్య ఆఫ్రికాలో హెచ్‌ఐవి వైరస్ ప్రాణం పోసుకుందని అంచనా వేస్తున్నారు. కామెరూన్ దేశంలో కొన్ని రకాల పెద్ద కోతులకు ఎస్.ఐ.వి. (సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకింది. ఇందులో వైల్డ్ చింపాంజీల్లాంటివాటి శరీరంలో ‘ఎస్‌ఐవి’ నిరోధకత లేదు. అదే, గుడ్లగూబకోతుల్లాంటివి మాత్రం తట్టుకోగలవు. వేటగాళ్లకుగానీ, వన్యమృగాల మాంస విక్రేతలకుగానీ ఈ వైరస్ పాకివుంటుంది. మనిషి శరీరంలోని రోగనిరోధకత ఈపాటి వైరస్‌ను సులభంగా అణచివేయగలదు!

బ్రిటన్ వలస దేశాలుగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో సమాజ మార్పులు జరిగి, వ్యభిచారం తీవ్రంగా పెరిగింది. 1928 ప్రాంతంలో కాంగో రాజధాని కిన్షాసాలో 45 శాతం మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. మామూలు శృంగారంలో ఈ వైరస్ వ్యాప్తి తక్కువే అయినా, భాగస్వాముల్లో ఒకరికి సుఖవ్యాధులు ఉన్నప్పుడు, మర్మాంగాల్లో పొక్కులు ఉన్నప్పుడు వైరస్ బలం ఎక్కువ.

అలాగే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా శుభ్రం చేయని సిరంజీలతో టీకాలు గంపగుత్తగా వేయడం వల్ల ఈ వైరస్ అతి త్వరగా వ్యాప్తిచెందిందనీ, అక్కణ్నుంచి ప్రపంచాన్ని చుట్టుకుపోయిందనీ చెబుతారు. హెచ్‌ఐవి వైరస్‌లో రెండు రకాలున్నాయి. హెచ్‌ఐవి -1. ఇది చింపాంజీ, గొరిల్లాలాంటివాటిల్లో కనబడింది. హెచ్‌ఐవి-2 మరికొన్ని రకాల కోతులకు సోకుతుంది. అయితే, వాటికి దాన్ని తట్టుకునే నిరోధకశక్తి ఉంది. హెచ్‌ఐవి-1ను తిరిగి ‘ఎం’, ‘ఎన్’, ‘ఒ’ , ‘పి’ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. మిగతావి కూడా ఎయిడ్స్‌ను కలగజేసినప్పటికీ ‘ఎం’ మనకు ఎక్కువ ప్రమాదకారి. 90 శాతం ఎయిడ్స్ రోగుల్లో ఉండేది ఇదే! హెచ్‌ఐవి అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నది నిజానికి ‘హెచ్‌ఐవి-1 ఎం’.

మూడు ముఖ్యమైన మార్గాలు

‘‘హోమో సెక్సువల్స్ కు దేవుడు విధించిన శిక్ష మాత్రమే కాదు ఎయిడ్స్; హోమోసెక్సువల్స్‌ను సహిస్తున్నందుకు దేవుడు సమాజానికి విధించిన శిక్ష కూడా’’ అన్నారు మత గురువు జెర్రీ ఫాల్‌వెల్. టాన్స్ జెండర్స్, హోమోసెక్సువల్స్, బై సెక్సువల్స్... భాగస్వాముల్ని మార్చుతారు కాబట్టి, హై రిస్కు గ్రూపుగా ఉన్నప్పటికీ, అది వాళ్లకు మాత్రమే పరిమితం చేయడం వివక్ష మాత్రమే అని చెప్పాలి. సురక్షిత శృంగారంలో పాల్గొనని ఎవరికైనా రిస్కులో తేడాలేదు. అత్యాధునిక సమాజమనుకునే అమెరికాలో కూడా ఇంత ప్రచారం జరిగినా, యువకుల్లో యాభై శాతం మంది కండోమ్‌ను ఉపయోగించట్లేదు.

వైరస్ శరీరరంలో ఉంటే కలిగే మార్పులు :

వైరస్ శరీరంలో ఉన్నవారితో లైంగిక సంబంధాల వల్ల, రక్తమార్పిడి వల్ల, బిడ్డ నుంచి తల్లికి ఇది ముఖ్యంగా సోకుతుంది. వెంటనే లక్షణాలు కనిపించవు. హెచ్‌ఐవి సోకినట్టు కూడా తెలియదు. కొంత కాలం గడిచాక జ్వరం రావడం, ముఖం, మెడ, ఛాతీ మీద రాష్ రావడం, లింఫ్‌నోడ్స్ వాచడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్లనొప్పులు వస్తాయి. బరువు తగ్గుతుంది. వికారం, వాంతులు ఇతర లక్షణాలు. వ్యాధి ముదురుతున్నకొద్దీ జ్వరం అధికమవడం, నీళ్ల విరేచనాలు, మర్మావయల్లో మంట, కంటిచూపు మందగించడం, శ్వాస పీల్చడం కష్టంకావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, డయేరియా కనబడతాయి. హెచ్‌ఐవీ రోగుల్లో అనుబంధ రోగాలు కూడా ఉండే అవకాశముంది. మూత్రపిండాల వ్యాధి (హెచ్‌ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి), మెదడు పనితీరులో మార్పులు, హెపటైటిస్ బి/సి, క్షయ.

సాధారణంగా అత్యధిక ప్రజానీకానికి (85శాతం) క్షయను కలిగించే ట్యూబర్‌క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే టీబీ వ్యాప్తికారక బ్యాక్టీరియా శరీరాల్లో ఉంటుంది. సహజంగా ఉండే వ్యాధి రోగనిరోధక శక్తి వల్ల బ్యాక్టీరియా నిద్రాణంగా ఉంటుంది. దీనికిదే టీబీ అవదు. హెచ్‌ఐవి సోకి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం మొదలు పెట్టగానే బ్యాక్టీరియా విజృంభిస్తుంది. అప్పుడు లక్షణాలు కనబడతాయి. అందుకే టీబీ ఉన్నవాళ్లకు హెచ్‌ఐవి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

వైరస్ సోకి ఉంటుందని తెలిస్తే…

వైరస్ సోకివుంటుందని అనుమానం వ్యక్తం చేసినవాళ్లకు ముందుగా 72 గంటల్లోపు(మూడు రోజుల్లోపు) ఎమర్జెన్సీ హెచ్‌ఐవి పిల్స్ ఇస్తారు (పోస్ట్ ఎక్స్ పోజర్ ప్రొఫిలాక్సిస్). ఈ చికిత్స నాలుగు వారాల పాటు సాగుతుంది. హెచ్‌ఐవి నిర్ధారణ పరీక్ష వైరస్ సోకిన నాలుగు నుంచి ఆరు వారాల్లో చేస్తారు. ‘పాజిటివ్’ అయితే గనక దానికి రోగి శరీరంలో రోగనిరోధకశక్తిని బయటినుంచి పెంచడమే మార్గం. దానికోసం ‘యాంటీ రెట్రోవైరల్’(ఎ.ఆర్.టి.) మందులు ఇస్తారు.

హెచ్ఐవీ తనను తాను కాపీ చేసుకుంటూ సంఖ్య పెంచుకోవడమేగాక, మందులనుంచి నిరోధకతను కూడా పెంపొందించుకుంటుంది. అందుకని ఆ వైరస్‌ను తప్పుదారి పట్టించేందుకు రకరకాల ఎ.ఆర్.టి. మందులను భిన్న కాంబినేషన్లుగా ఇస్తారు. ఈ మందులు ఇవ్వడం కూడా మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్, కాక్‌టెయిల్ ఆఫ్ మెడిసిన్స్! వీటిని దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతి మారిపోవచ్చు. కానీ జీవితకాలాన్ని పెంచుకోవడానికి వాటిని భరించాల్సిందే. ఇక, గర్భధారణ, ప్రసవం, పాలిచ్చే సమయంలో తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ సంక్రమించవచ్చు. ఇది 20-45 శాతం రిస్కు. నిర్ధారణ అవగానే తల్లి చికిత్స తీసుకోవడం, ముందే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయడం, పాలివ్వకపోవడం, బిడ్డకూ ప్రొఫిలాక్సిస్ మందులు ఇప్పించడం ద్వారా హెచ్‌ఐవి సంక్రమణ రిస్కును 2 శాతానికి తగ్గించవచ్చు.

Next Story