దేశంలో వ‌రుస‌గా రెండోరోజు ఆరువేలు దాటిన క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 4:21 AM GMT
దేశంలో వ‌రుస‌గా రెండోరోజు ఆరువేలు దాటిన క‌రోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కరోనాను ఎంత కట్టడి చేసినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 6654 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, ఒక్క రోజులోనే 6వేలకు పైగా కేసులు నమోదు కావడం వ‌రుస‌గా ఇది రెండ‌వ‌రోజు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటి వరకూ 1,25,101కు చేరింది. గత 24 గంటల్లో 137 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 3720కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 51,783 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 69,597 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2940 కరోనా కేసులు నమోదు కావడం మరింత భయాందోళన కలిగిస్తోంది. అంతేకాదు శుక్ర‌వారం ఒక్క రోజే 63మంది మరణించారు. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. మొదట్లో భారత్‌లో కేసులు నెమ్మదిగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఉదంతం తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్ప‌టి నుండి భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమై ఎన్నో జాగ్రత్తలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Next Story