ఏపీలో 19, తెలంగాణలో 67 కరోనా కేసులు..

By అంజి  Published on  28 March 2020 10:50 PM GMT
ఏపీలో 19, తెలంగాణలో 67 కరోనా కేసులు..

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో రెండు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున మొత్తం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. శనివారం 74 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 68 మందికి నెగిటివ్‌ అని తేలింది.

ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాబ్‌పేటలో రెండు కరోనా కేసులు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. నవాబ్‌పేట చుట్టూ మూడు కిలో మీటర్ల పరిధిని హసెన్సిటివ్‌ జోన్‌గా కలెక్టర్‌ ప్రకటించారు. అంతకుముందు చీరాల మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్‌ భేటీ అయ్యారు. ఇటీవల 16 మంది కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి నవాబ్‌పేటకు వచ్చారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,242 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 179 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది. రెండో పాజిటివ్‌ విశాఖ వాసి కోలుకుంటున్నాడని తెలిసింది.

Also Read: కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం

ఇక 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారిని మాత్రమే రాష్ట్రంలోని అనుమతించాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌లో పెట్టాలన్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చే వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Also Read: మీ సేవలకు కృతజ్ఞతలు : నర్స్ తో ప్రధాని

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 67కు చేరుకుంది.

Next Story