టెలీమెడిసిన్ ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2020 10:47 AM GMT
టెలీమెడిసిన్ ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వైఎస్ఆర్ టెలీమెడిసిన్ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. అమ‌రావ‌తిలోని తాడేప‌ల్లి సీఎం క్యాంప్ కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి అనంత‌రం టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు కాల్ చేసి డాక్ట‌ర్‌తో మాట్లాడారు. టెలీమెడిసిన్ విధానాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిత్యం ప‌ర్య‌వేక్షించాల‌ని అవ‌స‌రం అయితే.. వైద్యుల సంఖ్య పెంచాల‌ని సూచించారు.

టెలీమెడిస‌న్ అమ‌లుకు టోల్‌ప్రీ నెంబ‌ర్ -14410 కేటాయించింది. దీని ద్వారా స్వ‌చ్చంధ సేవ‌కు 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు ముందుకు వ‌చ్చారు. ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు.

క‌రోనా కేసుల‌ను గుర్తించి ఐసోలేట్ చేయ‌డం, ప‌రీక్షించ‌డం, క్వారంటైన్ పంప‌డం ఈ టెలీమెడిస‌న్ ముఖ్య ఉద్దేశం.

మూడంచెలుగా ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’:

స్టెప్‌–1:

రోగులు టోల్‌ ఫ్రీ నెంబరు 14410కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. త‌రువాత ఎగ్జిక్యూటివ్ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుకుని రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

స్టెప్‌–2:

రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో అందుబాటులో ఉండే డాక్ట‌ర్ల‌లో ఎవ‌రో ఒక‌రు ఆ కాల్‌ను రిసీవ్ చేసుకుని(కాల్ చేసి) ఓపీ సేవ‌లు అందిస్తారు. రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. రోగి చెప్పిన ల‌క్ష‌ణాలు బ‌ట్టి.. వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.

స్టెప్‌–3:

కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన చేస్తారు. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు త‌యారు చేస్తారు. ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

వైద్యాధికారి–పీహెచ్‌సీ:

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు. ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు. నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

Next Story