బూట్లతో కొట్టుకొంటూ.. వైసీపీ వీరాభిమాని ఆక్రోశం ..!

By Newsmeter.Network  Published on  17 Dec 2019 11:52 AM GMT
బూట్లతో కొట్టుకొంటూ.. వైసీపీ వీరాభిమాని ఆక్రోశం  ..!

ముఖ్యాంశాలు

  • చిత్తూరు స్పందన కార్యక్రమంలో గోడు
  • రేషన్‌, పెన్షన్‌ ఇవ్వకుండా తమ నేతలే అడ్డుకుంటున్నారని ఆవేదన

చిత్తూరు: మెడలో బూట్లు, నడుముకు గోనెసంచితో కనిపిస్తున్న ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజమాణిక్యం. ఒకింత నిరాశ, మరింత నిప్పులు కక్కుతున్న ఈ దివ్యాంగుడు.. వైఎస్‌ కుటుంబానికి విధేయుడు. జగన్‌ సీఎం అయ్యేదాకా జుట్టు తీయనని, గడ్డం చేయనని భీష్మించిన వీరాభిమాని! అలాంటి అభిమానే సర్కారుపై ఆగ్రహించాడు. మెడలో బూట్లతో తనను తాను కొట్టుకొంటూ సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన స్పందనలో ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించాడు. వికలాంగుల పెన్షన్‌, తెల్ల రేషన్‌కార్డుకు అర్హుడినైనా.. మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి చెబితేనే ఇస్తామని తహసీల్దార్‌ చెబుతున్నారని రాజమాణిక్యం వాపోయాడు. దళితుడినైన తనను అధికారులు పట్టించుకోవడం లేదన్నాడు. పార్టీ అభిమానం ఈ విషయంలో కనుమరుగైపోయిందని రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేశాడు.

పార్టీ గెలుపుకోసం పనిచేశానని, ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం అన్నాడు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమౌళిని కలిసి వినతిపత్రం అందించాడు. రాజమాణిక్యంది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నం. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడంతో, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి రాజమాణిక్యానిది. తొలి నుంచి వైఎస్‌ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన చనిపోయినప్పుడు ఇల్లు అమ్మి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. వైఎస్‌ కుటుంబంపై అభిమానంతో జగన్‌ సీఎం అయ్యేంత వరకు జుట్టు, గడ్డం తీయకుండా 6 సంవత్సరాల పాటు రాజమాణిక్యం అలాగే ఉన్నాడు.

Next Story