వారందరు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే: సీఎం జగన్‌

By సుభాష్  Published on  16 Dec 2019 3:20 PM GMT
వారందరు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే: సీఎం జగన్‌

జనవరి 1 నుంచి ఏపీ ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా.. కార్మికుల గురించి పట్టించుకున్నపాపాన పోలేదని దుయ్యబట్టారు.ఇప్పుడు టీడీపీనేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు రంగ సంస్థలోని ఉద్యోగులు.. ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తీసుకువచ్చిన విషయాన్ని జగన్‌ గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు తీసుకువచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని జగన్‌ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలన వల్ల రాష్ట్రాన్ని నాశనం చేశాడని, పైగా రాష్ట్రానికి ఏదో చేసినట్లు గొప్పలు చెప్పుకొంటున్నాడని ధ్వజమెత్తారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదని, అందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారన్నారు.

Next Story