విజయవాడకు చేరిన గన్నవరం 'హీట్'
By Medi Samrat Published on 26 Oct 2019 6:34 PM ISTవిజయవాడలో టీచర్ కాలనీ ఫన్ క్లబ్ వద్ద.. గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇంటివద్ద అతని అనుచరులు హడావుడి చేశారు. వైసీపీలోకి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వర్గీయులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రౌడీ వద్దు.. యార్లగడ్డ ముద్దు.. డౌన్ డౌన్ వంశీ.. సిగ్గు లేని వంశీ.. అంటూ తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో మాపై ఎన్నో కేసులు పెట్టి బాధించిన వంశీ రాజకీయ వ్యభిచారి అంటూ విరుచుకుపడ్డారు.
అనంతరం యార్లగడ్డ వైసీపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ముఖ్యమంత్రిని కలవడం జరుగుతుంది అని సర్ధి చెప్పారు. ఆపై మట్లాడుతూ.. వంశీ గతంలో మా కార్యకర్తలపై దాదాపు నాలుగు వేల కేసులు బనాయించడం జరిగిందని.. టీడీపీ పాలనలో గన్నవరం ప్రజలు, వైసీపీ శ్రేణులు అనేకఇబ్బందులు పడ్డారని అన్నారు. వంశీ.. వైఎస్ జగన్, భారతమ్మ మీద కూడా కేసులు పెట్టారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్ గారిని ఎమ్మెల్యే వంశీ కలవటంపై నాకు ఎటువంటి సమాచారం లేదని.. ముఖ్యమంత్రి గారిని కలసిన తరువాత అవసరమైతే మరోసారి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని యార్లగడ్డ అన్నారు.