మద్యం మత్తులో కన్న కొడుకుని అమ్మకానికి పెట్టిన తల్లి
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 10:14 AM GMTసమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. నమమాసాలు మోసిన కన్నబిడ్డను మద్యం మత్తులో ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మంగళవారం హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మద్యం మత్తులో ఓ మహిళ రూ.45 వేలకు ఓ మధ్యవర్తి ద్వారా తన బాబుని విక్రయిస్తుండగా.. ఆ మహిళతో పాటు మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని హబిబ్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సుబాన్పురాకు చెందిన అబ్దుల్ జోయాఖాన్, అబ్దుల్ ముజాహిద్ భార్యాభర్తలు. వీరికి షేక్ 2 నెలలు కుమారుడు ఉన్నాడు. ముజాహిద్ ఎర్రమంజిల్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మేనేజర్గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ మద్యం తాగి తరచూ గొడవ పడేవారన్నారు. ఈ క్రమంలో 3న ఇంటి నుంచి ముజాహిద్ బయటకు వెళ్లి 8వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంట్లో తన రెండు నెలల కుమారుడు అద్నాన్ కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హబిబ్ నగర్ పోలీసులు కాలాపత్తర్కు చెందిన సిరాజ్ అనే మహిళకు రూ.45 వేలకు బాలుడ్ని విక్రయించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురుని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. బాలుడిని ధర్మాసనం ద్వారా తల్లికి అప్పగించామని తెలిపారు.