బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 12:12 PM GMTహైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్గూడ వద్ద నిర్మించిన కుడివైపు ప్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ఫ్లై ఓవర్ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిగా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు. స్లాబ్స్, క్రాష్ బారియర్స్, ఫిక్షన్ స్లాబుల నిర్మాణంలో ఆర్సీసీ ఫ్రీకాస్ట్ టెక్నాలజీ వాడినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు.
ఈ ఫ్లైఓవర్ తో బైరామల్ గూడ జంక్షన్, సాగర్రోడ్ జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. బైరామల్గూడ జంక్షన్లో రద్దీ సమయంలో గంటకు దాదాపు.. 12 వేల వాహనాల రాక పోకలు సాగిస్తున్నాయని ఓ అంచనా. ఈ ఫ్లైఓవర్తో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు. సికింద్రాబాద్ నుండి ఒవైసీ జంక్షన్కు, శ్రీశైలం వెళ్లే వాహనదారులకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉపయోగకరంగా ఉండనుంది.
ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ. 448 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 పనుల్లో ఇప్పటికే 6 పూర్తయ్యాయి. మిగిలిన పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్లో నిర్మించిన కుడి వైపు ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్, కామినేని జంక్షన్లో కుడి వైపుతో పాటు ఎడమ వైపు ఫ్లైఓవర్ , చింతల్ కుంట అండర్ పాస్లు అందుబాటు లోకి రావడం తో సాఫీగా సాగుతోంది ప్రయాణం.శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ ను ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఎస్.ఆర్.డి.పి కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్డు విస్తరణ పనులను చేపట్టింది జీహెచ్ఎంసీ.