కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 11:58 AM GMT
కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో మాట్లాడిన ఆయన.. గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలని అన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్ర‌శ్నించారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని.. క‌నీసం 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని ఆరోపించారు.

కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదని.. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని.. రూ. 45వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే రూ. 85వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారన్నారు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి’ అని నడ్డా పిలుపునిచ్చారు.

కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచనని.. మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపడుతున్నామ‌న్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలని.. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోందని అన్నారు. కోవిడ్‌-19ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని నడ్డా వ్యాఖ్యానించారు.

Next Story