భారత్ లో 20 కోట్ల మంది కరోనాతో చనిపోతారా.?

By అంజి  Published on  23 March 2020 3:27 PM GMT
భారత్ లో 20 కోట్ల మంది కరోనాతో చనిపోతారా.?

కరోనా వైరస్..సుమారు 200 ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుందీ కంటికి కనిపించని శత్రువు. ఇప్పటికి లక్షల మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చావు - బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ఇప్పటి వరకూ 433 కరోనా కేసులు నమోదవ్వగా తెలంగాణలోనే 33 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 97 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువవుతుండటంతోనే మనదేశానికి ఇటలీకి పట్టిన గతి పట్టకుండా ఉండాలంటే..కొద్దిరోజులు కోట్లాదిమంది ప్రజలు ఇళ్లకి పరిమితమవ్వక తప్పదు. కరోనా బారీనుంచి దేశ ప్రజలను రక్షించేందుకే ఈనెల 25వ తేదీ నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. మరోవైపు దక్షిణమధ్య రైల్వే కూడా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. చాలా వరకూ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేసింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై తో సహా అన్ని ప్రధాన నగరాలు లాక్ డౌన్ అయ్యాయి. అయినా కరోనా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో కరోనా 3 స్టేజ్ కి వచ్చే ప్రమాదముందంటున్నారు నిపుణులు. అదే జరిగితే..భారత్ లో ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఇప్పటికైనా ప్రజలు కనీస బాధ్యతతో సెల్ఫ్ క్వారంటైన్ అవ్వకపోతే..మన దేశంలో సంభవించే మృత్యువులను ఆపడం ఎవ్వరితరం కాదంటున్నారు. కరోనా మూడో స్టేజ్ కి వస్తే..అది క్రమంగా నాల్గవ స్టేజ్ కి కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే మాత్రం దేశంలో జరిగే కోట్లాది మరణాలకు బాధ్యత ప్రజలే వహించాల్సి వస్తుందన్నారు. రెండో దశలోనే కరోనాను కట్టడి చేయకపోతే దేశంలో 20 కోట్ల కు పైగా మరణాలు తధ్యం అని చెప్తున్నారు.

ఇటలీ కన్నామనదేశ జనాభా 20 రెట్లు కన్నా ఎక్కువే. అక్కడే కరోనా మరణాలు సోమవారానికి 6000కు చేరువయ్యాయంటే..మనదేశంలో కరోనా విజృంభిస్తే ఏ స్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తాయో ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అంతస్థాయిలో మరణాలు సంభవించకుండా ఉండాలన్నా..మనందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా అంతా మనచేతిలోనే ఉంది. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. వీలైనంత వరకూ ఇళ్లకే పరిమితమవుదాం. కష్టకాలంలో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పండుగలు, పబ్బాలంటూ ఊర్లు వెళ్లకపోయినా పర్లేదు. పెళ్ళిళ్లుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈ ఒక్కసారి పండుగ లేదనుకుంటే జీవితంలో ఎన్నో పండుగలు జరుపుకోవచ్చు. లేదు పండుగే ముఖ్యం అనుకుంటే జీవితంలో ఇప్పుడొచ్చే ఉగాదే ఆఖరి పండుగ అవ్వొచ్చు..ఎవరు చెప్పినా..ఏం చెప్పినా అంతా మీ మంచికే. బాధ్యత గల పౌరులుగా మెలగండి. ఇంట్లో ఉండి దేశానికి సేవ చేద్దాం. కరోనా బారీ నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు దేశాన్ని రక్షిద్దాం.

Next Story