బెజవాడలో కరోనా లక్షణాలతో దంపతులు మృతి
By రాణి Published on 31 March 2020 8:41 PM IST
ఏపీ వాసులను కరోనా కంగారు పెడుతోంది. గంట గంటకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజులోనే 17 కరోనా కేసులు నమోదవ్వడంతో ఆంధ్రులు గాబరా పడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం విజయవాడలో కరోనా లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవలే ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన పాతబస్తీకి చెందిన దంపతులు ఆదివారం దగ్గు, ఆయాసంతో ఆస్పత్రిలో చేరారు. భార్య ఆదివారం సాయంత్రం మృతి చెందగా..భర్త సోమవారం ఉదయం మృతి చెందాడు. వీరిద్దరూ కరోనా లక్షణాలతో మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారికి కరోనా పరీక్షలు చేసిన వైద్యులు ఆ విషయాన్ని బయటపెట్టడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : సచివాలయాన్ని తాకిన కరోనా..
మృతి చెందిన దంపతుల ఇద్దరు కుమార్తెలతో పాటు ఇతర బంధువులను కూడా అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఇంకా దంపతుల మృతికి సంబంధించిన నివేదికలు రాలేదని, అవి వస్తే గాని వారి కరోనాతో మృతి చెందారా ? లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు డీఎంహెచ్ఓ అధికారులు. అయితే..విజయవాడలో పాతబస్తీకి చెందినవారు 26 మంది కూడా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లినట్లుగా గుర్తించి వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.
Also Read :మోదీ ట్రస్ట్కు తల్లి హీరాబెన్ విరాళం.. ఎంతంటే..