కాచిగూడ ప్రమాదస్థలిని పరిశీలించిన జీఎం ఏం చెప్పారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 Nov 2019 11:53 AM IST

కాచిగూడ ప్రమాదస్థలిని పరిశీలించిన జీఎం ఏం చెప్పారంటే..?

హైదరాబాద్‌: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ట్రైన్‌ను వెనుకనుండి మరో ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొట్టిన సోమవారం జ‌రిగిన విషయం తెలిసిందే. ప్రమాద స్థలిని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం గజానంద్‌ మల్యా పరిశీలించారు. గజానంద్‌తో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన బోర్డు సభ్యులు ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదంలో మూడు ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ కోచ్‌లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారుల సమక్షంలో కోచ్‌లను ట్రాక్‌లపై తొలగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేస్తున్నారు. సాయంత్రంలోగా ఎంఎంటీఎస్‌ రైళ్లను పూర్తి స్థాయిలో నడుపుతామని గజానంద్‌ మల్యా పేర్కొన్నారు. కాచిగూడ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జీఎం గజానంద్‌ మల్యా.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌ రైలు లోకో పైలట్‌ శేఖర్‌ ఇంజిన్‌ క్యాబిన్‌లో ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు. రైలు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో లోకో పైలట్‌ శేఖర్‌ను బయటకు తీసేందుకు గ్యాస్‌ కట్టర్‌ టీమ్‌లు, డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు ఎంతగానో ప్రయత్నించి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story