ఆంధ్రప్రదేశ్: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి సాయంత్రానికి ఇది పొట్టువిల్ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలోవా (శ్రీలంక)కు 620 కిలోమీటర్లు, కరైకల్ (తమిళనాడు)కు 990 కిలోమీటర్లు, చెన్నైకి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.
దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.