ఐఎండీ తుపాను హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

IMD cyclone warning.. Heavy rains in Telugu states. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతారవణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో

By అంజి  Published on  19 Oct 2022 5:57 AM GMT
ఐఎండీ తుపాను హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతారవణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 22 వరకు ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

ఏపీ తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గాలుల వేగం ఇంకా పెరిగే ఛాన్స్‌ ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది.

మరోవైపు రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈరోజు, రేపు సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, మధ్య ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షపాతం తరువాత తగ్గుతుంది. కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని శ్రావణి చెప్పారు.

Next Story