మిచౌంగ్ తుపాను: ఏపీలో భారీ వర్షాలు.. స్తంభించిన చెన్నై

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో పలుచోట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 7:00 AM GMT
heavy rains, cyclone effect, chennai, andhra pradesh,

మిచౌంగ్ తుపాను: ఏపీలో భారీ వర్షాలు.. స్తంభించిన చెన్నై

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో పలుచోట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ఈ తుపాను ప్రభావం ఎక్కుగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరింది. దాంతో వాటిని అధికారులు మూసివేశారు. చెన్నై చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపాను ప్రభావం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో ఇరుక్కున్న వారికి సహాయక చర్యలు అందిస్తున్నాయి. తాంబ్రం ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న 15 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైలోని పాఠశాలలను మూసివేశారు అధికారులు. కోర్టులకు కూడా సెలవు ఇచ్చినట్లు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్నాయని.. అనవసరంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 24 గంటల పాటు ప్రజలు ఇళ్లలోని ఉండాలని సూచిస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులో పలు రైళ్లు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు భారీ గా చేరుకుంటోంది. దాంతో.. విద్యుత్‌ సరఫరా కూడా అధికారులు ఆపేశారు. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. తమిళనాడులోని వలసరవాక్కంలో 15.4 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. నుంగంబాక్కంలో 10.1, చోలింగనల్లూరులో 12.5 సెం.మీ, కోడంబాక్కంలో 12.3 సెం.మీ, మీనంబాక్కంలో 10.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

ఏపీలో కూడా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగి పడిపోతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంతో తిరుపతిలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. తిరుపతి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

Next Story