తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

ద్రోణి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో..

By -  అంజి
Published on : 21 Sept 2025 8:34 AM IST

Telugu states, Heavy rains, Yellow alert, IMD, APSDMA

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ 

ఆంధ్రప్రదేశ్‌లో..

ద్రోణి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీ రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రికార్డు అయ్యాయి. శనివారం(20SEP) ఉదయం 8:30 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన రాష్ట్ర సగటు వర్షపాతం 6.9మిమీ, జిల్లాల వారీగా నమోదైన సగటు వర్షపాతం వివరాలు - అధిక వర్షపాతం వివరాలు.

తెలంగాణలో..

అటు తెలంగాణలో కూడా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్‌తో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రేపు కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

Next Story