ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: వాతావరణ శాఖ

By సుభాష్  Published on  11 Sep 2020 10:16 AM GMT
ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: వాతావరణ శాఖ

బీహార్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే తెలంగాణలో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎల్లుండి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్లు, ప్రజలు , అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఏపీలోనూ వచ్చే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

అలాగే అల్పపీడనం కారణంగా తూర్పు కర్ణాటక తీరం – అరేబియా సముద్రం మీద తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్నాం, మేఘాలయలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన వర్షాపాతం.. మల్లాపూర్‌ బయోడైవర్సిటీ 3.9, మౌలాలి 3., ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ 2.4, తార్నాక 2.2, కాప్రా రాజీవ్‌ నగర్‌ 1.8 సెంటీమీటర్ల చొప్పున వర్షాపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

విశాఖ జిల్లాకు పిడుగుల హెచ్చరిక

కాగా, ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో పిడుగుల హెచ్చరికలు వస్తున్నాయి. అరకులోయ, అనంతగిరి, జి. మాడుగుల, చింతపల్లె, రావికమతం, రోలుగుంట, కొయ్యూరులో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story