పాక్‌ సైనికులను తుడిచిపెట్టాలనుకున్నాం..

By సుభాష్  Published on  30 Oct 2020 4:52 AM GMT
పాక్‌ సైనికులను తుడిచిపెట్టాలనుకున్నాం..

గత ఏడాది ఫిబ్రవరిలో బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ చేసిన సైనిక అరాచకం విజయవంతమై ఉంటే పాక్‌ సైనిక విభాగాలను తుడిచిపెట్టేద్దామనుకున్నామని అప్పటి వైమానిక దళపతి బి.ఎస్‌.ధనోవా అన్నారు. పాక్‌పై దాడులు చేసేందుకు అప్పటికే భారత సైన్యం సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. అప్పడు పాక్‌ సైన్యానికి చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు వణికిపోయారని వచ్చిన వార్తల నేపథ్యంలో ధనోవా స్పందించారు. వర్ధమాన్‌ను అప్పగిచడం తప్ప ఆ సమయంలో వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పరంగా, దౌత్యపరంగా పాక్‌పై విపరీతమైన ఒత్తిడి ఉందని, అలాగే సైనికపరంగా భారత్‌ సిద్ధమవుతున్న పరిస్థితులను గమనించి ఎంత ప్రమాదకరమో పసిగట్టారని అన్నారు. భారత్‌ బలగాల బలాన్ని చూసే నాడు పాక్‌ నాయకులు గజగజ వణికిపోయి ఉంటారని ఆ దేశ నాయకుడి వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్‌ వైమానిక దాడుల తర్వాత పాక్‌ ఎలాంటి కుట్రలకు దిగినా.. ఒక్క భారత్‌ స్థావరం దెబ్బతిన్నా.. పాకిస్థాన్‌ స్థావరాలను పూర్తిగా నాశనం చూసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు.



కాగా, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విషయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జాదేవ్‌ బాజ్వా వణికిపోయారని ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. యుద్ద విమానం కూలిపోవడంతో పాక్‌కు చిక్కిన అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్‌ తమపై దాడి చేయనుందని అప్పటి ఓ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్‌ ఖురేషీ వెల్లడించినట్లు అసెంబ్లీ ముస్లిం లీగ్‌-ఎన్‌ నాయకుడు అయాజ్‌ సాధిక్‌ చెప్పారు. అయితే 2019 ఫిబ్రవరి నాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సైతం తిరస్కరించారు. ఈలోగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బాజ్వా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలు పట్టిపోయాయి. చర్చల అనంతరం పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్‌ ఖురేషి మీకు పుణ్యముంటుంది అభినందన్‌ను విడుదల చేయండి. లేదంటే భారత్‌ రాత్రి 9 గంటలకు మన మీద దాడి చేసేందుకు సిద్ధమవుతోంది అని అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడిచిపెట్టినప్పటి పరిస్థితులపై పాకిస్థాన్‌ పార్లమెంట్‌ నేషనల్‌ అసెంబ్లీలో పాక్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ నాయకుడు అయాజ్‌ సాధిక్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారని ఏఎన్‌ఐ వార్త సంస్థ పేర్కొంది. దీంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారట.

కాగా, జమ్మూలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌కు చెందిన జైష్‌-ఎ-మహ్మద్‌ తీవ్రవాద స్థావరంపై భారత్‌ వాయుసేన విరుచుకుపడింది. గత ఏడాది ఫిబ్రవరి 27న కశ్మీర్‌లో పాక్‌ విమానం చొరబాటును అడ్డుకోవడంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోరులో ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్‌-21 విమానంతో వెంటాడి మరీ కూల్చివేశారు. ఈ క్రమంలో విమానం కూలిపోవడంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కిందికి దిగాల్సి వచ్చింది. అది పాక్‌ భూభాగం కావడంతో పాక్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇరుదేశాల చర్చల అనంతరం 2019, మార్చి 1న అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. ఆయన ధైర్య సాహసానికి గాను భారత ప్రభుత్వం అభినందన్‌ను వీర చక్ర పతకంతో సత్కరించింది.

Next Story