విషాదం.. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి

Eight-year-old dies in Warangal after chocolate stuck in his throat. వరంగల్‌ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు

By అంజి  Published on  27 Nov 2022 5:24 AM GMT
విషాదం.. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి

వరంగల్‌ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. నగరంలోని పిన్నవారి వీధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన కంగహన్ ​​సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చాడు. అతడు జేపీఎన్‌ రోడ్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అతనికి భార్య గీత, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైన్‌లో నివసిస్తున్నాడు. కంగహన్ ​​ఇటీవల వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి పిల్లల కోసం చాక్లెట్లు తీసుకొచ్చాడు.

కంగహన్ ​​రెండవ కుమారుడు ఎనిమిదేళ్ల సందీప్ స్థానికంగా ఉన్న శారద పబ్లిక్ స్కూల్‌లో సెకండ్‌ క్లాస్‌ చదువుతున్నాడు. అతని సోదరుడు, సోదరి కూడా ఈ పాఠశాల విద్యార్థులే. బైక్‌పై స్కూలుకు వెళ్లే ముందు కంగహన్ ​​సింగ్ తల్లి పిల్లలకు చాక్లెట్లు ఇచ్చింది. నోటిలో చాక్లెట్ పెట్టుకుని స్కూల్ మొదటి అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లిన సందీప్ కొద్దిసేపటి తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కంగహన్ ​​సింగ్ వెంటనే వచ్చి అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయిందని, చికిత్స పొందుతూ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. శనివారం సాయంత్రం సందీప్ అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Next Story