Ganta Srinivasa Rao Sensational Comments On Vizag Steel Plant Privatization. విశాఖ ఉక్కుపై కేంద్రం వైఖరిని ప్రధాన మంత్రి స్వయంగా
By Medi Samrat Published on 9 March 2021 10:33 AM GMT
విశాఖ ఉక్కుపై కేంద్రం వైఖరిని ప్రధాన మంత్రి స్వయంగా చెప్పారని.. ఈ విషయంపై అందరం కలిసి పోరాడాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పెద్దలు మాత్రం ఇంకా ఏమీ జరగలేదంటూ.. తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విషయాన్ని ముగిసిన అధ్యాయమని ఆర్థిక మంత్రి అన్నారనీ.. రాష్ట్రానికి సైతం సమాచారం అందిస్తున్నామని నిర్మలాసీతారామన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు.. సీఎంతో కలిసి పనిచేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణకు.. రాష్ట్ర బిజేపి నేతలు ప్రధాన పాత్ర పోషించాలని గంటా శ్రీనివాస్ అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడేందుకు ఢిల్లీ లో పాదయాత్రకు తాము సిద్ధంగా ఉన్నారనీ.. అందరూ కలిసిరావాలని గంటా పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రధానిని కలిసినప్పుడు.. ఉక్కు విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్పై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల తరఫున జనసేన అధినేత పోరాడాలని గంటా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందనీ.. కార్యచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎం జగన్ను కోరుతున్నామన్నారు. రాజీనామా చేస్తే.. టిడిపి పోటీ పెట్టబోదని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు.