Fact Check : బీజేపీ నేత కపిల్ మిశ్రా చెల్లెలు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 12:15 PM GMT
Fact Check : బీజేపీ నేత కపిల్ మిశ్రా చెల్లెలు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టు..!

ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా పేరు ఫిబ్రవరి నెలలో బాగా వినిపించింది. ఢిల్లీలో చోటుచేసుకున్న మతఘర్షణలకు కపిల్ మిశ్రా కారణమంటూ పలువురు నేతలు ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రస్తుతం ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ పెళ్లి ఫోటోను సామాజిక మాధ్యమాల్లో బాగా షేర్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఆ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తున్న వ్యక్తులు చెబుతోంది ఏమిటంటే.. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కపిల్ మిశ్రా చెల్లెలు అని.. ఆమె ముస్లిం వ్యక్తి షాజాద్ అలీని పెళ్లి చేసుకుందని పోస్టులలో చెబుతూ ఉన్నారు.

“Kapil Mishra’s sister married Shehzad Ali. Why am I tweeting this? To tell u that how much ever hate u spread you cannot kill love. Love is the sapling that will tear apart mountains to come out. Spread love. Be the sapling that will grow to give flowers, fruits & shade to others,” అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చాడు ఓ యూజర్. షాజాద్ అలీ అనే వ్యక్తిని కపిల్ మిశ్రా చెల్లెలు చేసుకుంది. ఈ ట్వీట్ ను ఎందుకు పోస్టు చేస్తున్నానంటే.. ప్రేమను ఎవరూ చంపలేరు అని చెప్పడానికే..! ప్రేమకు ఏవీ అడ్డురావు అనే చెప్పడమే తన ట్వీట్ ఉద్దేశ్యం అని ట్వీట్ లో ఉంది.

ఆగష్టు 29న మరో ట్విట్టర్ ఖాతాదారుడు.. ఢిల్లీలో హిందూ-ముస్లిం గొడవలకు కారణమైన కపిల్ మిశ్రా సోదరి షాజాద్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని చెప్పుకొచ్చాడు. 400 పైగా రీట్వీట్లు ఆ పోస్టుకు లభించింది.

ఆగష్టు 30న ఫేస్ బుక్ యూజర్ ఇదే ఫోటోను పోస్టు చేశాడు. 3000 కు పైగా షేర్స్ వచ్చాయి.

నిజ నిర్ధారణ:

కపిల్ మిశ్రా సోదరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఎన్డీటీవీ ఏప్రిల్ 18, 2016న పోస్టు చేసింది. మైసూర్ బన్నిమంట లోని తాజ్ కన్వెన్షన్ హాల్ లో హిందూ-ముస్లిం జంట అయిన ఆషిత బాబు, షకీల్ అహ్మద్ పెళ్లి జరిగిందని అందులో తెలిపింది. ఎంతో పటిష్ట భద్రత మధ్య ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగింది. స్థానికంగా ఉన్న భజరంగ్ దళ్ సభ్యులు, బీజేపీ నేతలు ఆషిత బాబు ఇస్లాంను స్వీకరించడాన్ని తప్పుబట్టారు. లవ్ జీహాద్ లో భాగంగా అమ్మాయిని ట్రాప్ చేసి ముస్లింగా మార్చారంటూ ఆరోపించారు. అందుకే అప్పట్లో ఈ పెళ్లిని అడ్డుకుంటామని వారు తెలిపారు.

2016లో వీరి పెళ్ళికి సంబంధించిన సమాచారాన్ని మంగళూరుకు చెందిన న్యూస్ వెబ్ సైట్ Coastal Digest లో కూడా ప్రచురించడం జరిగింది. Indian Express కూడా ఈ పెళ్లి గురించి కథనాన్ని ప్రచురించింది.

ఈ ఫోటో ప్రజలను తప్పుదావ పట్టించేదని కపిల్ మిశ్రా కూడా తెలిపారు. తనకు ముగ్గురు చెల్లెల్లు ఉన్నారని.. వారిలో ఇద్దరికి పెళ్లి అయిందని అన్నారు. నాకు తెలిసి మా బంధువుల్లో ఎవరు కూడా ముస్లింను పెళ్లి చేసుకోలేదని కపిల్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ Boom Live కూడా ఈ వైరల్ పోస్టులో నిజం లేదని తెలిపింది.

2016లో మైసూర్ లో పెళ్లి చేసుకున్న హిందూ-ముస్లిం జంటకు సంబంధించిన ఫోటో ఇది. ఈ పెళ్ళికి కపిల్ మిశ్రాకు ఎటువంటి సంబంధం లేదు.

వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Next Story