ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అనుమానస్పద మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2020 11:37 AM GMT
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అనుమానస్పద మృతి

వికారాబాద్ జిల్లా ధ‌రూర్ మండలం హరిదాస్ ప‌ల్లికి చెందిన హరి శివ‌ శంకర్ రెడ్డి ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. ఉన్న‌త చ‌దువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన హరి శివ‌ శంకర్ రెడ్డి.. ఆస్ట్రేలియాలోని స‌ద‌ర‌న్ క్రాస్ యూనివ‌ర్సటీలో చ‌దువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి రూమ్‌లో ఉంటున్న హరి శివ‌ శంకర్ రెడ్డి బాత్ రూమ్‌లో కింద‌ పడిపోయాడు.

వెంటనే మిగతా స్నేహితులు హాస్పిటల్ కి తరలించారు. కానీ హాస్పిటల్ లో స్పృహలోకి రాలేదు. దీంతో వెంటనే అక్కడ ఉండే ప్రవాస భారతీయులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మైరుగైన వైద్యం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోగా శివశంకర్ మృతిచెందాడు.

మృతి చెందాడనే వార్త తెలువడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం తమ బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా చొర‌వ చూపాల‌ని.. చివరి చూపు అయిన దక్కేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.

హరి శివ‌ శంకర్ రెడ్డి.. సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంప‌తుల‌కు ఒక్క‌గానొక్క కుమారుడు. వ్యవసాయం కుటుంబంలో జన్మించిన హరి శివ‌ శంకర్ రెడ్డి.. ఉన్నత చదువుకోసం వెళ్లి.. దేశంగాని దేశంలో మృతి చెందడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story