సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ‌.. ఒక్క సంతకంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి..

MLA Angani Satya Prasad Letter To CM Jagan. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలోని పోలీసుల

By Medi Samrat  Published on  31 Oct 2021 8:36 AM GMT
సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ‌.. ఒక్క సంతకంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలోని పోలీసుల సమస్యల పరిష్కారం, వీక్లీ ఆఫ్ అమలు, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, పదోన్నతులు, వేతనాల సమస్య పరిష్కారం గురించి బహిరంగ లేఖ రాశారు. ప్రజా సంరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ అలుపెరుగక పని చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా వంటి మహమ్మారి ప్రాణాలను కబలిస్తున్నా లెక్క చేయక ముందుండి పోరాడారు. తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించారు. ఉగ్రవాదం, నక్సలిజం వంటి అసాంఘిక శక్తుల నుండి సమాజాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ క్షణ క్షణం ప్రమాదపుటంచున నిలబడి పోలీసులు విధులు నిర్వహించారని గుర్తుచేశారు.

అసలు పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కూడా కష్టమేన‌ని.. అటువంటి పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం అత్యంత బాధాకరం అని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలవడంలో కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు గత రెండున్నర సంవత్సరాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కోన్నారు. సైనికుల్లా రేయింబవళ్లు సేవలందిస్తున్న సిబ్బందికి డి.ఎ, టి.ఎ సకాలంలో ఇవ్వకపోవడం దుర్మార్గం అని అన్నారు. పండగలు, పుట్టిన రోజులు వంటి వాటికి కూడా దూరంగా ఉంటూ రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారని.. సెలవు రోజుల్లో పనిచేసినందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కూడా గత రెండున్నరేళ్లుగా ఎప్పుడిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

అధికారంలోకి వచ్చిన కొత్తలో.. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలోనూ అదే మాట చెప్పారు. ఇప్పుడు మళ్లీ హామీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీక్లీ ఆఫ్ అమలుపై నివేదిక సమర్పించి రెండేళ్లవుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నది సమాధానం లేని ప్రశ్న అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర ప్రోటోకాల్ విధులు నిర్వహించే సిబ్బందికి కనీసం వసతి సదుపాయం కూడా కల్పించక పోవడంతో రోడ్లపైనే సేద దీరే పరిస్థితులు నెలకొన్నాయని అన‌గాని లేఖ‌లో తెలిపారు.

రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖలోని ఖాళీలన్నింటినీ భర్తా చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై తీవ్ర పని భారం పడుతోందని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. కుటుంబాలను వదిలి రేయింబవళ్లు విధి నిర్వహణలో నిలిచిన వారికి కనీసం ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందడం లేదని.. ఇవన్నీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమ‌ని లేఖ‌లో విమ‌ర్శించారు. పెన్షనర్లను ముప్పుతిప్పలు పెడుతున్న CFMS విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్క సంతకంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి.. రెండున్నరేళ్లు గడిచినా పీఆర్సీ, సీపీఎస్ వంటి వాటిపై కనీసం నోరెత్తడం లేదని ప్ర‌శ్నించారు.


Next Story