అటువంటి వారు సీబీఐ జేడీగా వ‌ద్దు : అమిత్ షాకు విజ‌య‌సాయిరెడ్డి లేఖ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jan 2020 12:24 PM GMT
అటువంటి వారు సీబీఐ జేడీగా వ‌ద్దు : అమిత్ షాకు విజ‌య‌సాయిరెడ్డి లేఖ..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ మేర‌కు లేఖ‌లో సీబీఐ జేడీ నియామ‌కం విష‌యంలో అమిత్‌ షాకు ప‌లు విష‌యాలు వివ‌రించారు. విజ‌య‌సాయి లేఖ ప్ర‌కారం.. ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాదులో సీబీఐ జేడీగా నియమించాలని కోరారు. దేశ ప్రయోజనాల రీత్యా.. చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని నియమించాలని సూచించారు.

అలాగే.. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని లేఖ‌లో పేర్కొన్నారు. అంతేగాక‌.. వైయస్ జగన్‌కు ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు.. నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారని వివ‌రించారు. ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మినారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారని.. బాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఇబ్బందులు సృష్టించారని అన్నారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన ద్వారా.. రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగిందని.. ఆయ‌న‌ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించారని.. కానీ.. టీడీపీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారని పేర్కొన్నారు.

అలాగే.. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీగా ఉన్న‌ కృష్ణ సైతం తెలుగు వ్యక్తని, రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారని లేఖ‌లో తెలిపారు. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని.. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారని లేఖ‌లో వివ‌రించారు. వెంకటేష్ తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. కానీ ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేన‌ని.. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని తెలిపారు.

లక్ష్మీనారాయణతో వెంక‌టేష్‌కు పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని.. ఆయ‌న‌ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో వెంక‌టేష్ ఎస్పీగా పని చేశారని.. చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని వివ‌రించారు. చంద్ర‌బాబు హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్ లో నియమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ సీబీఐ జేడీల‌ నియామకాలు.. దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయని వివ‌రించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా నియమించాలని హోంమంత్రి అమిత్ షాను విజయసాయి రెడ్డి లేఖ‌లో కోరారు.

స్పందించిన అమిత్ షా..!

ఇక‌, విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను అమిత్ షా ఆదేశించారు.

Cbi 20200111145824 Page 001 Cbi 20200111145824 Page 002 Cbi 20200111145824 Page 003 Cbi 20200111145824 Page 004

Next Story