భారత్లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు తెలుసా.?
By అంజి Published on 20 Feb 2020 6:00 AM GMTభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆరుగురు అమెరికా అధ్యక్షులు మన దేశంలో పర్యటించారు. ఇప్పుడు ట్రంప్ భారత్ పర్యటనతో ఈ సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. వీరిలో బరాక్ ఒబామా రెండు సార్లు భారత్లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా మన దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో భార్య మెలానియాతో కలిసి ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్లలో పర్యటిస్తారు.
1959లో మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్ భారత్లో పర్యటించారు. ఢిల్లీతో పాటు ఆగ్రా తదితర ప్రాంతాలను నాలుగు రోజుల పాటు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసింగించారు. భారత్- అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో గొప్ప మైలు రాయి అని అప్పటి ప్రధాని జవహర్నెహ్రూ అన్నారు.
1969లో రిచర్డ్ ఎం.నిక్సన్.. మనదేశంలో పర్యటించిన రెండో అమెరికా అధ్యక్షుడు. ఆయన ఒక్క రోజులోనే తన పర్యటనను పూర్తిచేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో ఉన్న విబేధాలను తగ్గించుకోవడానికే ఈ పర్యటన జరిగినట్లు ఆనాటి పత్రికలు ప్రచురించాయి. ఇదిలా ఉంటే నిక్సన్ బంగ్లాదేశ్తో యుద్ధం సమయంలో పాకిస్తాన్కు తన మద్దతు తెలిపాడు.
అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ తన తల్లితో 1978లో భారత్ పర్యటన చేశారు. అప్పుడు మనదేశ ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్టర్ మూడు రోజులు పర్యటించారు. బంగ్లాదేశ్ యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షల నేపథ్యంలోనే ఈ పర్యటన జరిగినట్లు చెబుతుంటారు. అప్పుడు భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక అంశాల్లో కొంత బెడిసి కొట్టాయి.
దాదాపు 20 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు బిల్క్లింటన్ భారత్లో పర్యటించారు. 2000 సంవత్సరంలో ఆయన భారత్ వచ్చినప్పుడు దేశ ప్రధానిగా అటల్బిహారీ వాజ్పేయి ఉన్నారు. కార్గిల్ యుద్ధం విషయమై క్లింటర్ జోక్యాన్ని వాజ్పేయి స్వాగతించారు. బిల్ క్లింటన్ ఐదు రోజుల పాటు భారత్లో ఉన్నారు.
2006లో జార్జి బుష్ తన భార్య లారా బుష్తో కలిసి భారత్లో పర్యటించారు. అప్పుడు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. భారత్లో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన.. ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలను సందర్శించారు. బుష్ పార్లమెంట్లో ప్రసంగించకూడదంటూ కమ్యూనిస్టు పక్షాలు వ్యతిరేకించాయి. పురానా ఖిల్లా వద్ద కొద్ది మందిని ఉద్దేశించి జార్జి బుష్ మాట్లాడారు.
రెండు దేశాల సంబంధాలు మరింత మెరుగుపర్చేందుకు బరాక్ ఒబామా ఎంతో కృషి చేశారు. ఆయన మొదటిసారిగా 2010లో భారత్లో పర్యటించారు. పార్లమెంట్లో సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద నిరోధక చర్యలపై ఒబామా కీలక ప్రకటన చేశారు. ఆతర్వాత 2015లో మరోసారి ఒబామా తన భార్య మిషెల్తో కలిసి భారత్లో పర్యటించారు. భారత గణతంత్ర వేడుకలకు తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. తన పర్యటనలతో భారత్ తమకు ఎంతో కీలకమంటూ ఒబామా స్పష్టమైన సంకేతాలిచ్చారు.