యూపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 25 వేల మంది హోంగార్డులను..
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Oct 2019 11:35 AM GMTఉత్తరప్రదేశ్: సీఎం యోగినాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తగినంత బడ్జెట్ లేని కారణంగా 25 వేల మంది హోంగార్డులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఓకే సారి 25 వేల మంది హోంగార్డులను తొలగించడం ఇప్పుడు అక్కడ సంచలనమైంది. బడ్జెట్ లేని కారణంగా జీతాలు చెల్లించలేకపోతున్నట్టు ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెబుతోంది. ఉత్తరప్రదేశ్ సీఎస్ అధ్యక్షతన ఆగస్టు 28న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీ పోలీస్ హెడ్క్వార్టర్స్ తెలిపింది. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ బీపీ జోగ్దాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే ప్రస్తుతం ఉన్న హోంగార్డుల పని దినాలను 15 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు కూడా వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ పరిమితంగా ఉన్న నేపథ్యంలో హోంగార్డులను ఉద్యోగాలు వదలి వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 25 వేల మంది హోంగార్డుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.