ఆ టీచర్ ఆదాయం కోటిపైనే.. షాక్లో అధికారులు
By తోట వంశీ కుమార్
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదు అనే సామెత ఉంది కాదా.. అలాగే ఉంది ఆ పంతులమ్మ నిర్వాకం. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుందో.. చేసే పని అధికారులకు ఎలా తెలుస్తుందిలే అన్న ధీమానో తెలీదు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ స్కూల్లో పనిచేస్తూనే మరో 25 పాఠశాలలో పనిచేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదండోయ్ సదరు పంతులమ్మకు నెలకు 25 పాఠశాలలకు సంబంధించిన వేతనం అందుతోంది. ఇలా ఇప్పటి ఆమె కోటి రూపాయలకు పైగానే జీతం తీసుకుంది. ఇటీవల ఆన్లైన్లో నమోదు చేసుకున్న క్రమంలో ఈ ఉపాధ్యాయురాలి బాగోతం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయ(కేజీవీబీ)లో పుల్టైం పనిచేస్తోంది. కాగా.. ఇటీవల ప్రాథమిక విద్యా విభాగం టీచర్ల డిజిటల్ డేటాబేస్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాల్లో అమేథి, అంబేద్కర్ నగర్, రాబరేలి, అలీగఢ్ సహా ఇతర 25 ప్రాంతాల్లో ఉన్న పాఠశాల్లలో ఒకే టీచర్ పని చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఆరాతీయగా కేజీబీవీలో పనిచేస్తున్న అనామికనేనని గుర్తించారు. దాదాపు 13 నెలల పాటు అంటే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దాదాపు కోటీ రూపాలయలకు పైగా వేతనాన్ని ఆమె తీసుకుంది. ఒక్కో సూల్క్ నుంచి నెలకు రూ.30వేల చొప్పున రూ.7.50లక్షలను అందుకుంది. ఇందుకు సంబంధించి ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను పరీశీలిస్తున్నారు. వెంటనే ఆమెకు వేతనాన్ని నిలిపివేసిన అధికారులు ఆమెకు నోటీసులు పంపించారు.
ఫిబ్రవరి నెలలోనే ఈమె చేసిన మోసం బయటపడినా.. లాక్డౌన్ వల్ల విచారణ జరగలేదు. ప్రస్తుతం ఆమెపై విచారణ జరుగుతుంది. ఆమె అన్ని స్కూళ్లలో పనిచేస్తున్నట్లు అసలు రికార్డులు ఎలా సృష్టించిందని, అది కూడా ఆన్లైన్లో అటెండెన్స్ పడేలా ఎలా చేసింది..? ఎవరెవరు ఆమెకు సహకరించారు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వ విద్యాశాఖ వైఖరిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.