కరోనా సాయం: 35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి

By సుభాష్  Published on  21 March 2020 7:32 AM GMT
కరోనా సాయం: 35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. వైరస్ విస్తరించకుండా చర్యలు చేపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక ఆంక్షలు విధించింది కేంద్రం. కరోనా భయంతో ప్రతీ ఒక్కరు నివాసాలకే పరిమితం అవుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. ముందే ఆర్థిక ఇబ్బందులు.. అందులో కరోనా వైరస్‌ కారణంగా మరిన్నీ ఇబ్బందులు.. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కూలీలకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీపి కబురు అందించారు.

ఉత్తరప్రదేశ్‌లోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తామని యోగి ఆదినాత్యనాథ్‌ స్పష్టం చేశారు. ఈ డబ్బు కూలీల నిత్యవసర సరుకులకు, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది కోలుకుంటున్నట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 11వేలకు చేరుకున్నాయి. రెండున్నర లక్షలకుపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కరోనా కేసులు 200 దాటిపోయాయి. ఐదు మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో కరోనా కేసులు 19కి చేరుకున్నాయి.



Next Story