ఉన్నావ్‌ కేసు: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు

By సుభాష్  Published on  13 March 2020 8:21 AM GMT
ఉన్నావ్‌ కేసు: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు

ఉన్నావ్‌ అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు మరో పదేళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలి తండ్రి లాకప్‌ డేత్‌ కేసులోఇటీవల సెంగార్‌ను హత్యానేరం కింద దోషిగా ఖరారు చేసిన ఢిల్లీ కోర్టు.. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. సెంగార్‌తోపాటు మరో అరుగురు దోషులకు కూడా పది సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీస్‌ హజారీ కోర్టు జిల్లా జడ్జి ధర్మేశ్‌ శర్మ తీర్పునిచ్చారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి పరిహారం కింద సెంగార్‌, అతని సోదరుడు అతుల్‌ సెంగార్‌ చెరో పది లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

కాగా, 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ రేప్‌ కేసుకు సంబంధించి కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌కు ఇది రెండో శిక్ష. ఇప్పటికే ఈ కేసులో సెంగార్‌కు జీవిత ఖైదీ విధించి, బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని గత ఏడాది సెంబర్‌ నెలలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

శిక్షను తగ్గించుకునేందకు కుల్దీప్‌ తీవ్ర ప్రయత్నాలు

అత్యాచారం కేసులో ఇటీవల కుల్దీప్‌సింగ్‌కు జీవిత ఖైదీ విధించగా, శిక్షను తగ్గించుకునేందుకు కుల్దీప్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. సెంగార్‌ 35 ఏళ్లపాటు రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారని, దీనిని కూడా పరిగణలోకి తీసుకుని శిక్ష ఖరారు చేయాలని ఆయన తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. తాజాగా రెండో శిక్షగా పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు

Next Story