సోషల్‌ మీడియా ద్వారా పరిచయం.. ప్రేమ, పెళ్లి పేరుతో అత్యాచారం

By సుభాష్  Published on  13 March 2020 6:47 AM GMT
సోషల్‌ మీడియా ద్వారా పరిచయం.. ప్రేమ, పెళ్లి పేరుతో అత్యాచారం

సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన పాతబస్తీకి చెందిన ఓ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి గుల్బార్గా యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు యువకుడిపై చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన యువతి (22)కి కర్ణాటకలోని గుల్బార్గా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అద్నాన్‌ (25) 2015లో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ప్రేమకు దారి తీసింది. దీంతో అద్నాన్‌ పలుమార్లు పాతబస్తీకి వచ్చి యువతితో కలిసి వెళ్లేవాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు.

ఈ క్రమంలో గతంలో బండ్లగూడకు వచ్చిన అద్నాన్‌.. ఇంట్లో ఎవరులేని సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒప్పించి నిఖా చేసుకుంటానని నమ్మించాడు. కాగా, రోజులు గడుస్తున్నా యువకుడు స్పందించకపోవడంతో యువతి గుల్బార్గాకు వెళ్లి అతన్ని కలిసింది. తాను ప్రైవేటు ఉద్యోగంలో బిజీగా ఉన్నానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. తర్వాత ఎంతకి స్పందించకపోవడంతో సదరు యువతి గుల్బార్గాకు వెళ్లి వివరాలు తెలుసుకోగా, అద్నాన్‌కు నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. దీంతో షాక్‌కు గురైన యువతి చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుల్బార్గాకు వెళ్లి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story