పసికూనను చావుదెబ్బ కొట్టిన యువ భారత్

By Newsmeter.Network  Published on  21 Jan 2020 12:18 PM GMT
పసికూనను చావుదెబ్బ కొట్టిన యువ భారత్

ఐసీసీ అండర్‌ 19 ప్రపంచ కప్‌ లో యువ భారత్ అదరగొడుతోంది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పసికూన జపాన్‌ తో మంగళవారం జరిగిన మ్యాచ్‌ లో భారత్ దుమ్మురేపింది. భారత్ ధాటికి జపాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. అండర్‌ -19 ప్రపంచ కప్‌ లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌. 2002 అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో కెనడా, 2008లో బంగ్లాదేశ్‌ 41 పరుగులకు ఆలౌట్‌ కాగా, 2004లో స్కాట్లాండ్‌ జట్టు 22 పరుగులకే ఆలౌట్‌ అయి మొదటి స్థానంలో నిలిచింది.

టాస్‌ గెలిచిన యువభారత్‌ కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ జపాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జపాన్‌ ఆటగాళ్లు భారత బౌలింగ్‌ ను ఎదుర్కొనడానికి ఆపసోపాలు పడ్డారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వచ్చీరాగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్‌ రవి బిష్ణోయి (8-3-5-4) ధాటికి జపాన్‌ బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఐదో ఓవర్‌లో ఓపెనర్‌ (కెప్టెన్‌) మార్కస్‌ థర్గేట్‌ వికెట్‌తతో మొదలైన పతనం 22వ ఓవర్‌ వచ్చే సరికి పూర్తయింది. ఐదో ఓవర్లో రెండు వికెట్లు, ఏడో ఓవర్లో రెండు వికెట్లు, పదో ఓవర్‌లో రెండు వికెట్లను జపాన్‌ జట్టు కోల్పోయింది. మిగతా నాలుగు వికెట్లను 11, 17, 20, 22 ఓవర్లలో సమర్పించుకుంది. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్‌ అయ్యారు. ముగ్గురు ఒక్క పరుగుకే పరిమితం అయ్యారు. షు నొగుచి (7), కెంటో ఒటొ డుబెల్‌ (7), మాక్స్‌ క్లెమెంట్స్‌ (5) టాప్‌ స్కోరర్లు. జపాన్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్‌ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. భారత బౌలర్లలో రవి భిష్నోయ్‌ 4, కార్తిక్‌ త్యాగి 3, ఆకాశ్‌ సింగ్‌ 2, విద్యాధర్‌ పాటిల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

42 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ (29; 18 బంతుల్లో 5×4, 1×6), కుమార కుశాగ్ర (13; 11 బంతుల్లో 2×4)అజేయంగా నిలిచారు. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌-ఏలో ప్రస్తుతం భారత్‌ 2 విజయాలు, 4 పాయింట్లు, +3.702 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది.

Next Story