గంగానదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు

By అంజి  Published on  8 March 2020 4:52 AM GMT
గంగానదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు

ముఖ్యాంశాలు

  • గాలింపు చర్యలు చేపట్టిన బీహార్‌ ప్రభుత్వం
  • విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించిన కాలేజీ యాజమాన్యం
  • ఘటనపై ఆరా తీసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

బీహార్‌ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గంగానదిలో గల్లంతు అయ్యారు. అద్దంకి పట్టణానికి చెందిన వెంకట సాయి కిరణ్‌, దర్శికి చెందిన ఫణీంద్ర గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరంతా బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా సమీపంలోని భాగల్పూర్‌ ట్రిపుల్‌ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఐదుగురు విద్యార్థులు గంగా నదికి ఈతకు వెళ్లారు. అంతకుముంద సాయి కిరణ్‌, ఫణితేజ్ స్నాక్స్‌ తిన్నారు. చేతులు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నదిలో జారిపడి గల్లంతయ్యారని సమాచారం.

విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జరిగిన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం తెలిపింది. కుటుంబ సభ్యులు వెంటనే భగల్‌పూర్‌ వెళ్లారు. కాగా విద్యార్థి సాయికిరణ్‌ కుటుంబ సభ్యులను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.. బీహార్‌ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

Next Story