ఒకే నంబర్‌తో రెండు సిమ్‌లు.. ఖాతాల్లో రూ. 80 లక్షలు మయం

By సుభాష్  Published on  16 Jun 2020 4:57 AM GMT
ఒకే నంబర్‌తో రెండు సిమ్‌లు.. ఖాతాల్లో రూ. 80 లక్షలు మయం

హైదరాబాద్‌ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎందరో అమాయకులు, వ్యాపారులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని విధానాలుగా చర్యలు చేపట్టి వారి అగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నా.. ఇంకా ఎక్కడో ఓ చోటు పుట్టుకొచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నేరగాళ్ల మోసానికి ఇద్దరు బాధితులు రూ.80 లక్షలు కోల్పోయారు.

హైదరాబాద్‌నగరంలో వరుసగా వెలుగులోకి వచ్చిన సిమ్‌కార్డుల బ్లాక్‌ స్కామ్‌లను సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎయిర్‌టెల్‌ సంస్థకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒకరి సిమ్‌కార్డు యాక్టివ్‌లో ఉండగా, దానిని బ్లాక్‌ చేసి మరొకరికి అదే నెంబర్‌తో సిమ్‌కార్డు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. కేవలం 15రోజుల వ్యవధిలో ఈ సిమ్‌ బ్లాక్‌ స్కామ్‌కు నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులు బలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకరి ఖాతా నుంచి రూ.38 లక్షలు..మరొకరి ఖాతా నుంచి రూ.50లక్షలను సైబర్‌ నేరగాళ్లు నొక్కేసిన విషయం తెలిసిందే.

ఇద్దరు వ్యాపారుల ఖాతాల్లోంచి లక్షల్లో మయం

రెండు వారాల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఖాతా నుంచి రూ.38 లక్షలు నొక్కేసిన ఘటన మరువకముందే గత నాలుగు రోజుల కిందట జరిగిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని అమీర్ పేట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఖాతా నుంచి రూ.50 లక్షలు సైబర్‌నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ ఇద్దరు వ్యాపారులు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఖాతాలకుకొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో నిర్వహిస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన ఓటీపీ సహా అలెర్ట్స్‌ కోసం తాము వినియోగిస్తున్న ఎయిర్‌టెల్‌ నంబర్లకు అనుసంధానించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి ఫోన్‌ పని చేయలేదు. ఆయన వెంటనే రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.38 లక్షలు సైబర్‌ నేరగాళ్లకు చేరాయి.

అమీర్‌పేట వ్యాపారి మాత్రం తన సిమ్‌కార్డు బ్లాక్‌ అయిన విషయం గుర్తించి ఎయిర్‌టెన్‌ను సంప్రదించగా, మీ నెంబర్‌తో చెన్నై లో కొత్త సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అయింనది, అందుకే మీ సిమ్‌ బ్లాక్‌ అయ్యిందంటూ ఎయిర్‌టెస్‌ సంస్థ సమాధానమిచ్చింది. ఇలా ఎందుకు జరిగిందని సదరు వ్యాపారి ప్రశ్నించగా, సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి.. బ్యాంకు ఖాతాలను పరిశీలించాడు. ఇంకేముంది రెండు దఫాల్లో రూ.50 లక్షలు మాయమైనట్లు తేలింది. ఈ రెండు నేరాలు జరగడానికి వ్యాపారులు వినియోగిస్తున్న నెంబర్‌తోనే మరో సిమ్‌కార్డు జారీ కావడమే ఇందుకు కారణమని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.

సిమ్‌ కార్డులపై పోలీసుల దర్యాప్తు

ఇలా ఇద్దరు వ్యాపారుల సిమ్‌కార్డులు బ్లాక్‌ అయి వేరే సిమ్‌ కార్డులు యాక్టివ్‌ కావడంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ పత్రాలు లేకుండా సిమ్‌ కార్డులు ఎలా జారీ చేశారని పోలీసులు ఆరా తీశారు. ఇక కేసుల దర్యాప్తులో భాగంగా సిటీ క్రైమ్‌ సైబర్‌ నేరగాళ్లు ఈ ఖాతాలకు యాక్సెస్‌ ఎలా చేశారనే దానిపై టెక్నికల్‌ పరంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story