విషాదం : పాము ముట్టిన పాలు తాగి కవల బాలికలు మృతి
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sep 2020 7:48 AM GMTఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ మరడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చోట్కా మరదా గ్రామంలో ఇద్దరు చిన్నారి కవలలు శనివారం మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అయితే.. ఆ బాలికలు ఎలా మరణించారో తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులు హడలిపోయారు.
వివరాళ్లోకెళితే.. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బాలికలు ఇద్దరూ ఏడుస్తుండటంతో తండ్రి వారికి పాలు పట్టించాడు. అయితే ఆ పాలు తాగిన కొద్దిసేపటికే ఆ కవల బాలికల నోటి నుండి నురుగు రావడం ప్రారంభమైంది. సమాచారం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు ఇంటిలోనికి వచ్చి చుట్టుపక్కలా వెతకగా.. పాము కప్పను మింగుతూ కనిపించింది.
దీంతో పాము పాలను ముట్టడం కారణంగానే.. పాలు విషపూరితమయ్యాయని.. అవే పాలు బాలికలకు పట్టించడం కారణంగా ఈ విషాదం జరిగివుంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. అప్పటికే బాలికల పరిస్థితి విషమంగా మారడంతో వారిని మౌ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్కు తరలించిన కొద్దిసేపటికే పెద్ద కుమార్తె జిక్రా పర్వీన్ చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు. ఆ తరువాత చికిత్స పొందుతూ జిక్రా పర్వీన్ చెల్లెలు.. ఇక్రా ఖాటూన్ కూడా చనిపోయింది. దీంతో ఆ చిన్నారుల కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.