నిషేధం సడలింపు: అత్యవసర దేశాలకు మందులను వెంటనే పంపిస్తాం: భారత్
By సుభాష్ Published on 7 April 2020 6:58 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాలన్నింటికీ వ్యాపించింది. ఇక వైరస్ వల్ల అగ్రరాజ్యమైన అమెరికా సైతం అతలాకుతలం అవుతోంది. ఈ మహమ్మారి బారిన వైలాదిగా మరణాలు, పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని మందులను గత రెండు వారాలుగా ఇతర దేశాలకు ఎగుమతిని భారత్ నిలిపివేసింది.
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లీరోక్విన్ను తమకు పంపాలని ట్రంప్ మోదీని కోరారు. ఈ మెడిసిన్ కరోనా చికిత్సకు బాగా పని చేస్తుందని నిపుణులు సైతం స్పష్టం చేశారు. అయితే అమెరికా-భారత్కు మధ్య మంచి సంబంధాలున్నాయని, తమ అభ్యర్థనను నిరాకరించిన పక్షంలో ప్రతీకార చర్యలకు దిగేందుకు వెనుకాడమని అమెరికా స్పష్టం చేసింది. ఈ మెడిసిన్ను ఇతర దేశాలకు ఎగుమతిని నిలిపివేసిందన్న విషయం తమకు తెలుసని, అనేక సంవత్సరాలుగా వాణిజ్యానికి సంబంధించి భారత్కు తమ దేశం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు ట్రంప్.
ఈ నేపథ్యంలో మందులను ఇతర దేశాలకు ఎగుమతి నిషేధాన్ని భారత్ సడలిచింది. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న అత్యవసర దేశాలకు అవసరమైన మందులను వెంటనే పంపుతామని భారత్ ప్రకటించింది.