తెలంగాణ మంత్రుల వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు.. వేలకొద్ది జరిమానాలు..!
By సుభాష్ Published on 23 Feb 2020 9:32 AM GMTరోడ్లపై స్పీడ్ దాటితేనే చాలు ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో క్లిక్మనిపించి వేలకొద్ది జరిమానాలు వేస్తున్నారు. ఇక వాహనాలపై 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో సామాన్య ప్రజల వాహనాలకే కాదు.. తెలంగాణ మంత్రులు వాహనాలపై కూడా చలాన్లు నమోదవుతున్నాయి. అంతేకాదు మంత్రుల కార్లకు నమోదైన చలాన్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ చలాన్లు కావడమే గమనార్హం.
కాగా, అధికంగా ట్రాఫిక్ చలాన్లతో ఉన్న మంత్రి జగదీష్రెడ్డి కారుపై 9 చలాన్లకు గానూ రూ.9 వేల315 నమోదు కాగా, ఈటెల రాజేందర్ వాహనంపై 6 చలాన్లకు గానూ రూ. 6వేల 210 జరిమానా ఉంది. అలాగే కొప్పుల వాహనంపై 5 చలాన్లకు గానూ రూ. 5వేల 175, సబితా ఇంద్రారెడ్డి సొంత వాహనంపై 5 చలాన్లకు రూ.2వేల 775, ఇక గంగులా కమలాకర్, పువ్వాడ అజయ్ వాహనాలపై మూడు చొప్పున చలాన్లు ఉండగా, శ్రీనివాస్ గౌడ్, వాహనంపై రెండు చలాన్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇలా మంత్రులు కూడా నిబంధనలు బ్రేక్ చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.