విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

సినీ నటి, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, తెలంగాణ రాములమ్మ విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌

By సుభాష్  Published on  9 Nov 2020 11:07 AM GMT
విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

సినీ నటి, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, తెలంగాణ రాములమ్మ విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కోలుకోలేదేమో అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌ కాస్త ముందుగా బాధ్యతలు చేపడితే బాగుండేదని అనడం అన్నారు. ఇప్పుడు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌ సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కొందరిని ప్రలోభపెట్టి ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందన్నారు. మరికొంత ముందుగా మాణిక్యం ఠాగూర్‌ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది కావచ్చన్నారు. ఇప్పుడు కాలము, ప్రజలే నిర్ణయించాలి అని అన్నారు.

కొన్ని రోజుల కిందట రాములమ్మ బీజేపీలో చేరబోతున్నారన్న పుకార్లు వినిపించాయి. దానికి తోడు ఆమెతో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే వెంటనే కాంగ్రెస్‌ నేతలు ఆమెతో సంప్రదింపులు జరిపి విజయశాంతి పార్టీ వీడటం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కూడా స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి ఆమెతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని కోరారు. దాంతో ఆమె పార్టీ మారడం లేదని సంకేతాలిచ్చారు.

కాగా, తాజాగా ఆదివారం విజయశాంతి చేసిన కామెంట్లు బీజేపీ వైపే వెళ్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీని బలహీన పర్చడం వల్లే బీజేపీ టీఆర్‌ఎస్‌కు సవాలు విసిరే స్థాయికి చేరిందన్నారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏది ఏమైనా విజయశాంతి కమలం గూటికి చేరడం ఖాయమని మరి కొందరు వ్యాఖ్యనిస్తున్నారు.

Next Story