తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్
ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి
By Knakam Karthik
తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్
తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. దీంతో ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టనున్నారు. సరికొత్త ఉత్సాహంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలని ప్రభుత్వం బడిబాటతో అవగాహన కల్పిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై అధికారులు దృష్టిపెట్టారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు కూడా విద్యార్థులను ఆకర్శించడానికి సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు 2025--26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఈ క్యాలెండర్ను విడుదల చేశారు. దీని ప్రకారం నేటి నుంచే పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 230 పనిదినాలను ఖరారు చేశారు. ఈ క్యాలెండర్లో బోధన సమయాలతో పాటు, సెలవులు, పరీక్షల తేదీలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను స్పష్టంగా పొందుపరిచారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ఈ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజాగా విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగనున్నాయి. కాగా తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాలల యజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఈ ఏడాది నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు:
ఇక తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. కాగా తొలి ఏడాది 210 స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రతి రోజు 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ సూచించింది. ఇది విద్యార్థులలో మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది.
ఏపీలో స్టూడెంట్స్కు గుడ్న్యూస్:
ఏపీలోనూ గురువారం నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఈసారి స్కూల్ ఫస్ట్ డే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థి మిత్ర కిట్ పేరుతో తొలిరోజే వారికి అందజేయనుంది. ఈ కిట్లో రెండు జతల స్కూల్ యూనిఫాంలు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి. మరోవైపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15 వేలు అందించడానికి సిద్ధపడింది.