తిరుమల ఆలయ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేసే యోచనలో టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీ వెంకటేశ్వర ఆలయానికి సంబంధించిన దర్శనం, వసతి, లడ్డూ పంపిణీ, శ్రీవారి సేవ వంటి సేవలను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉంది.

By Medi Samrat  Published on  6 Sep 2024 4:00 PM GMT
తిరుమల ఆలయ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేసే యోచనలో టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీ వెంకటేశ్వర ఆలయానికి సంబంధించిన దర్శనం, వసతి, లడ్డూ పంపిణీ, శ్రీవారి సేవ వంటి సేవలను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉంది. తిరుమలలో అందుబాటులోకి తెచ్చే సేవలలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం తిరుమలలో 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు దీనిపై వివరణ ఇచ్చారు. ఆధార్ ఆధారిత ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు.

ఆగస్టు 29 నుండి లడ్డూ పంపిణీని హేతుబద్ధీకరించడంతో పాటు భక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు దేవస్థానం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వివరించారు. లడ్డూల బ్లాక్ మార్కెట్‌ను ఎదుర్కోవడానికి టిక్కెట్ లేని భక్తులకు ఆధార్ కార్డుకు రెండు లడ్డూలను మాత్రమే ఇస్తుందని తెలిపారు. అయితే దర్శనం టోకెన్‌లు ఉన్నవారు లభ్యత ఆధారంగా అపరిమిత లడ్డూలను, ఒక ఉచిత లడ్డూను పొందవచ్చన్నారు. ప్రసాదాల నాణ్యతను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు తిరుమలలోని వంటశాలలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Next Story