డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందని తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిలకు ఈ-డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు. ఈరోజుల్లో టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చని స్పష్టం చేశారు. కాకపోతే టోకెన్ లేని భక్తులకు దర్శనాలు లేకపోవటంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ బస్సుల్లో బ్యానర్లు, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్రాడ్ కాస్టింగ్, టీటీడీ సోషియల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులందరూ సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ భక్తులకు తెలియజేశారు.