ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి.. తిరుమల భక్తులను ఎలా మోసం చేశాడంటే.?
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 1:45 PM IST
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు. టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చెలామణి అవుతూ ఛైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ రాజు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. నకిలీ వెబ్ సైట్లను, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే దర్శనం, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.