తిరుమలలో మే 14 నుంచి 18 వరకు ఐదురోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు. సర్వదర్శనంలో రోజుకు 10 నుండి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. కావున దర్శనానికి వచ్చే భక్తులు సహకరిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్లో పాదరక్షలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభించామన్నారు. త్వరలో పీఏసీ 1, 2, 3, నారాయణగిరి క్యూల్కెన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కూడా ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యథావిధిగా 1240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఇస్తామన్నారు.
శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఐటీ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ వెబ్సైట్ల గురించి తెలిస్తే 155257 కాల్సెంటర్కు సమాచారం ఇవ్వాలన్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను ఈవో సూచించారు.