తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

తిరుమ‌ల‌కు వచ్చే భ‌క్తుల‌కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది.

By Medi Samrat
Published on : 19 Jun 2025 5:45 PM IST

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

తిరుమ‌ల‌కు వచ్చే భ‌క్తుల‌కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి జెండా ఊపి ప్రారంభించారు. తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుంచి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు తిరిగే మార్గంలోనే ఈ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని చెప్పారు .

టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్రతిరోజూ 300 ట్రిప్పులు ఉన్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. వాటికి ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వడంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఉందన్నారు. ప్రతి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్రజా ర‌వాణా వ్యవ‌స్థ బ‌లోపేతమవుతుందని అన్నారు. భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్దకు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బ‌స్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు.

Next Story